ఒక రాజుకి నలుగురు భార్యలు ఉండేవారు. అతను నాలుగో భార్యను ఎంతగానో ప్రేమించేవాడు, ఆమె కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉండేవాడు.

మూడో భార్యను కూడా ప్రేమించేవాడు. కానీ ఆమెను ఇతరులు తీసుకెళ్తారేమో అని భయపడేవాడు, అందుకే ఎప్పటికప్పుడు ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేసేవాడు.

రెండో భార్య అతనికి నమ్మకమైనది. కష్టాల్లో సాయం చేసేది, సలహాలు ఇచ్చేది. కానీ అతను ఆమెను అంతగా ప్రేమించేవాడు కాదు.

మొదటి భార్య అతనికి అత్యంత విశ్వాసంగా ఉండేది. ఎప్పుడూ అతని పక్కనే ఉండేది, కానీ అతను ఆమెను అస్సలు పట్టించుకొనే వాడుకాదు.

ఒక రోజు రాజు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యాడు. తన మరణం దగ్గరపడిందని గ్రహించి భార్యలను తనతో రావాలని అడిగాడు.

నాలుగో భార్య వెంటనే నిరాకరించింది. “నేను నీతో అస్సలు రాలేను” అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు చాలా బాధపడ్డాడు.

మూడో భార్య కూడా అదేవిధంగా “నీ మరణం తర్వాత నేను ఇంకొకరితో జీవిస్తాను” అని చెప్పి అతన్ని వదిలేసి వెళ్ళింది. రాజు మరింత బాధపడ్డాడు.

రెండో భార్య “నీ అంత్యక్రియల వరకు మాత్రమే వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయింది. రాజు మరింత నిరాశ చెందాడు.

మొదటి భార్య మాత్రం “నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, ఎక్కడికైనా వస్తాను” అని చెప్పింది. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు.

వీరిలో నాలుగో భార్య మన శరీరం, మూడోది సంపద, రెండోది కుటుంబం, మొదటిది మన ఆత్మ అని బుద్ధుడు మనకి బోధిస్తాడు.