వేద పురాణాల్లో మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తుంటారు. అలాంటి ఈ పురాణంలో ఎన్నో ఆసక్తికరమైన కధలు, రాజకీయ ఎత్తుగడలు, యుద్ధ నైపుణ్యాలే కాదు, సైన్సుకి కి కూడా అంతు చిక్కని రహశ్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాల గురించి వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గానూ, ఇన్స్పైరింగ్ గానూ ఉంటుంది. ఇద్దరు తల్లుల గర్భంలో పెరిగి, రెండుగా విడిపోయిన శరీర భాగాలతో పుట్టి, అతి పరాక్రమవంతుడిగా మారిన ఒక వీరుడు ఎన్నో రాజ్యాలని జయించినప్పటికీ, చివరకి ఊహించని విధంగా చనిపోవటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో, ఆ పరిస్థితుల వెనుక ఉన్న అసలైన కారణాలు ఏమిటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం.
జరాసంధుని పుట్టుక రహశ్యం
పూర్వం మగధ సామ్రాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్లు కాశిరాజుకి పుట్టిన కవల కూతుళ్లు. వారిద్దర్నీ సమానంగా ప్రేమిస్తానని బృహద్రథుడు భార్యలిద్దరికీ మాట ఇచ్చాడు.
అయితే ఎన్ని మంగళ కార్యాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అతనికి పిల్లలు పుట్టలేదు. ఒకసారి చండకౌశికుడనే ముని వీరి రాజ్యానికి వచ్చాడు. పుత్రుణ్ని ప్రసాదించమని రాజు ఆ మునిని ప్రార్థించాడు. ముని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. కొంత సేపటికి, ఓ మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడింది.
దాన్ని మంత్రించి రాజు చేతికిచ్చాడు. అతడా పండును తీసుకువెళ్లి భార్యల చేతిలో పెట్టాడు. భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్లు ఆ పండును రెండు సగాలు చేసి తిన్నారు. ఆ తర్వాత ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు. కొంత కాలానికి రాణులిద్దరూ సగం పండుని తినటం వల్ల సగం శరీరాలున్న శిశువులకు జన్మనిచ్చారు.
ప్రాణం లేని ఆ శిశువు యొక్క రెండు శరీర భాగాలు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి వాట్గిని అడవిలో పడవేయమని బృహద్రథుడు ఆదేశిస్తాడు. రాజు ఆదేశానుసారం ఆ శిశువులిద్దరినీ భటులు అడవిలో పడేసి వస్తారు.
అదే అడవిలో జర అనే ఓ రాక్షసి సంచరిస్తూ ఉండేది. ఒకసారి నరమాంసం కోసం వెతుకుతున్న ఆ రాక్షసికి ఈ శిశువులు ఏడుస్తూ కనిపిస్తారు. చూడటానికి ముద్దుగా కనిపిస్తున్న ఆ శిశువుల్ని చంపబుద్ధి కాలేదు ఆమెకి. వెంటనే వారిద్దరినీ తన చేతిలోకి తీసుకోగా, ఊహించని విధంగా రెండు ముక్కలు కలిసిపోయి, సజీవ బిడ్డగా మారాయి. వెంటనే ఆ శిశువు అత్యంత శక్తివంతంగా మారి, పెద్దగా కేకలు వేయడంతో జర చాలా భయపడ సాగింది.
బతికి ఉన్న బిడ్డను తినడానికి ఎంతైనా ఆమె మనసు ఒప్పుకోలేదు. వెంటనే జర ఆ శిశువును రాజు వద్దకు తీసుకెళ్లి జరిగినదంతా చెప్పింది. ఆ శిశువు మరెవరో కాదు, తన బిడ్డే అని తెలుసుకొన్న బృహద్రథుడు తన కుమారుడిని చూసి ఎంతో సంతోషించాడు. అందుకు కృతజ్ఞతగా జర పేరు కలిసి వచ్చేలా తన బిడ్డకి “జరాసంధ” అని పేరు పెట్టాడు. ఇక్కడ జర అంటే రాక్షసి పేరు; సంధ అంటే చేరడం జరాసంధ అంటే జరచే చేరినవాడు అని అర్ధం.
తర్వాత కొద్దిరోజులకి చండకౌశికుడు మళ్ళీ బృహద్రథుని ఆస్థానానికి వస్తాడు. బృహద్రథుని కుమారుడిని చూసి, ఈ పిల్లవాడు గొప్ప శివభక్తుడిగా ఎదుగుతాడని ఊహిస్తాడు. ఆయన చెప్పినట్లే, జరాసంధుడు గొప్ప శివభక్తుడు అవుతాడు. అంతే కాదు, దానధర్మాల్లో కర్ణుడితో సమానంగా ఉండేవాడు. అడిగిన వారికి కాదనకుండా విరివిగా దానాలు చేసేవాడు.
యుక్తవయసులోకి రాగానే జరాసంధుడు అత్యంత బలవంతుడిగా మారాడు. మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేశాడు. ఎదుటివాడు ఎంత బలసంపన్నుడైనా సరే అతని బలాన్ని హరించే శక్తి కలిగి ఉండేవాడు. ఏ ఆయుధంతోనూ చావురాని విధంగా శివుని నుండీ వరం పొందిన హంస డింభకులనే రాక్షసులని మిత్రులుగా కలిగి ఉన్నాడు జరాసంధుడు. వారి సహాయంతోనే ఎన్నో రాజ్యాలని గెలిచి, తన సామ్రాజ్యంలో కలిపేసుకొన్నాడు. ఇలా రోజురోజుకీ అతని శక్తి పెరుగుతూనే ఉంది. కానీ వారసులు లేకపోవడంతో భవిష్యత్తు గురించి ఆందోళన చెందాడు.
బలరాముడు మరియు కృష్ణుడితో విభేదాలు
జరాసంధునికి అస్తి, ప్రాప్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధురని పరిపాలించే కంసుడు జరాసంధుని దృష్టిని ఆకర్షించాడు. అతని ధైర్యసాహసాలకు ముగ్ధుడై, తన ఇద్దరు కుమార్తెలను అతనికిచ్చి వివాహం చేస్తాడు. దీంతో కంసుడు జరాసంధునికి అల్లుడుగా మారతాడు. ఇదిలా ఉంటే, కొంతకాలానికి కంసుడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చని పోతాడని తెలుస్తుంది. అందుకే భయంతో ఆమెకు పుట్టిన పిల్లలను వరసగా చంపడం మొదలు పెడతాడు. కానీ, చివరికి అనుకోని విధంగా మల్ల యుద్ధంలో శ్రీకృష్ణుని చేతిలో చనిపోతాడు.
దాంతో తన కూతుళ్ళిద్దరూ ఒకేసారి విధవలైపోయారు. తండ్రి దగ్గరికి చేరి, ‘మా భర్తను చంపిన వాణ్ని చంపి ప్రతీకారం తీర్చుకో’మని జరాసంధుని కోరతారు. తన కుమార్తెల పరిస్థితి చూసి జరాసంధకు కోపం వచ్చింది. ఆ తర్వాత, జరాసంధ కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. వెంటనే 23 అక్షౌహిణుల సైన్యంతో మధురపై దాడి చేసాడు, కానీ కృష్ణుడు, బలరాముడు కలిసి జరాసంధుడు అతని సైన్యాన్ని తిప్పికొడతారు.
అంతటితో ఊరుకోక మళ్ళీ మధురపై దాడికి దిగుతాడు. మళ్ళీ కూడా అతని సైన్యాన్ని తిప్పికోడతారు. ఇలా జరాసంధ మధురపై వరుసగా 17 సార్లు దాడి చేసి, ప్రతిసారీ కృష్ణుని చేతిలో ఓడిపోతాడు. అయితే, ఇలా దాడిచేసిన ప్రతిసారీ జరాసంధుని సైన్యాన్ని అయితే తిప్పి కొడుతున్నారు కానీ, మధురలోని ప్రజలు మాత్రం నానా ఇబ్బందులూ పడుతూ వచ్చారు.
తన రాజ్యంలోని ప్రజల ఇబ్బందులని గమనించిన శ్రీకృష్ణుడు ఇక ఎక్కువకాలం తన రాజ్యాన్ని ఇక్కడ ఉంచటం మంచిది కాదని ఊహిస్తాడు. అందుకోసం వెంటనే మరొక చోటకి మార్చాలని అనుకొంటాడు. వెంటనే దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి సముద్రం మద్యలో ఒక అద్భుతమైన నగరాన్ని రాత్రికి రాత్రే నిర్మించమని ఆజ్ఞాపించాడు, తర్వాత కృష్ణుడు మధురలో ప్రజలందరినీ ద్వారక అనే కొత్త నగరానికి తీసుకువెళతాడు.
18వ దాడి సమయంలో జరాసంధ మళ్లీ దాడి చేసినప్పుడు అతను మధుర నగరాన్ని తగులబెడతాడు. ఆ మంటల్లో పడి బలరామ కృష్ణులు కూడా చనిపోయి ఉంటారని భావించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ, వాళ్ళు తమ శక్తులను ఉపయోగించి క్షేమంగా ద్వారకకు చేరుకొంటారు.