మహాభారతంలో ఎంతోమంది గొప్ప యోధులు ఉన్నారు. అయితే వారిలో ఎవరు గొప్ప అని అడిగితే అది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే, ఒకరిని మించిన శక్తి మరొకరిది. మిగతావాళ్ళని పక్కన పెడితే, కర్ణుడు మరియు అర్జనుడు వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అనే ప్రశ్న తలెత్తినప్పుడు కొంతమంది కర్ణుడు పక్షాన మాట్లాడితే, ఇంకొంతమంది అర్జనుడి పక్షాన మాట్లాడతారు. అందుకే ఈ మాట శతాబ్దాల తరబడి మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోయింది. నిజానికి వీళ్ళిద్దరూ సోదరులే అయినప్పటికీ, విధి వారిని యుద్ధంలో పాల్గొనేలా చేసింది. అంతేకాదు, మహాభారతంలో వీరిద్దరూ అత్యంత శక్తివంతమైన పాత్రలుగా మిగిలిపోయారు. ఇంతకీ వీరిద్దరిలో గ్రేట్ వారియర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కర్ణుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకొందాం.
కర్ణుడి పుట్టుక:
కర్ణుడు పాండవులకు సవతి సోదరుడు. సూర్య భగవానుని అనుగ్రహం చేత కుంతీదేవికి కలిగిన కుమారుడే కర్ణుడు. అయితే, తనకి వివాహం కాకుండానే కలిగిన కుమారుడు కావటంతో భయపడి కుంతి కర్ణుడిని గంగానదిలో విడిచిపెడుతుంది. పుట్టుకతోనే కవచ కుండలాలని కలిగి మెరిసిపోతూ నదిలో తేలియాడుతున్న ఆ శిశువుని చూసి… సంతానం లేని అతిరథ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొంటూ వచ్చారు. అతిరథుడు అంటే వేరే మరెవరో కాదు, కౌరవుల తండ్రైన ధృతరాష్ట్రుని యొక్క రథసారథి. సూత వంశంలో పెరిగినందువల్ల కర్ణుడు సూత పుత్రుడుగా పిలవబడ్డాడు.
కర్ణుడి విద్యాభ్యాసం :
కౌరవ, పాండవులతో సమానంగా కర్ణుడు కూడా గురువు ద్రోణాచార్యుని దగ్గర సకల విద్యలూ నేర్చుకొన్నాడు. సూతపుత్రుడన్న కారణం చేత ద్రోణాచార్యుడు ఇతనికి అస్త్రవిద్య నేర్పలేదు. కానీ, ఎలాగైనా అస్త్రవిద్య నేర్చుకోవాలన్న పట్టుదలతో, తానొక బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి, పరశురాముని దగ్గర అస్త్రవిద్య నేర్చుకొంటాడు.
కర్ణుడి శాపాలు:
కర్ణుడు అబద్ధమాడి అస్త్రవిద్య నేర్చుకొన్నాడన్న విషయం ఆలస్యంగా తెలుసుకొంటాడు పరశురాముడు. నిజం తెలుసుకొన్న అతను వెంటనే తాను ఉపదేశించిన ఆ దివ్యాస్త్రాలు ఆపత్కాల సమయంలో ఫలించవు అని శాపమిస్తాడు.
పరశురాముడి ఆశ్రమంలో విలువిద్య నేర్చుకొనే సమయంలోనే ఒకసారి తాను వేసిన బాణం దగ్గరలో మేత మేస్తున్న ఒక బ్రాహ్మణుని ఆవుకి తగిలి అది చనిపోతుంది. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఒక నిస్సహాయ జంతువును చంపిన విధంగానే నీవుకూడా యుద్ధరంగంలో నిస్సహాయంగా చంపబడతావని శపిస్తాడు.
ఒకసారి కర్ణుడు నెయ్యి పార పోసుకుని ఏడుస్తూ వెళుతున్న ఒక చిన్నారిని చూశాడు. అదే నెయ్యి కావాలని ఆ చిన్నారి పట్టుపట్టటంతో మట్టి నుండి నెయ్యిని పిండి ఇస్తాడు. దీంతో భూమాత ఆగ్రహించి యుద్ధభూమిలో కీలకమైన సమయంలో నీ రథచక్రాన్ని భూమిలో బంధిస్తానని శపిస్తుంది.
ఇలా కర్ణుడి జీవితంలో తాను పొందిన ఒక్కో శాపం చివరి సమయంలో తన మరణానికి కారణమవుతాయి.
కర్ణుడి స్నేహం:
ఒకసారి హస్తినాపురంలో ద్రోణుడి సమక్షంలో కర్ణుడు మరియు అర్జునుడుల మద్య పోటీ జరుగుతుంది. యుద్ధ సామర్థ్యాలలో అర్జునుడితో సమానమైన వ్యక్తి అయినప్పటికీ కర్ణుడిని సూతపుత్రుడని తనకి ఆ అర్హత లేదని అంతా హేళన చేస్తారు. అది తట్టుకోలేని దుర్యోధనుడు వెంటనే కర్ణుడిని తన స్నేహితునిగా చేసుకొని అంగ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. అందరూ ఎగతాళి చేసినపుడు దుర్యోధనుడు ఒక్కడే తనని సమర్థించాడు కాబట్టి అప్పటినుంచీ కర్ణుడు దుర్యోధనుడిని ప్రాణమిత్రుడిగా భావిస్తాడు.
కర్ణుడు తల్లికిచ్చిన మాట
కొంతకాలానికి పరిస్థితుల ప్రభావం చేత యుద్ధం అనివార్యమైంది. యుద్ధం సమీపిస్తున్న తరుణంలో ఒకరోజు కుంతి కర్ణుడి దగ్గరకి వచ్చి తన జన్మ రహశ్యాన్ని చెప్తుంది. ఇంకా తన సోదరులకి ఏవిధమైన కీడు తలపెట్టవద్దని ప్రాదేయపడుతుంది. అప్పుడు కర్ణుడు తన నలుగురు సోదరులకు హాని చేయనని, అర్జునుడితో మాత్రమే ద్వంద్వ పోరాటం చేస్తానాని తల్లికి మాట ఇస్తాడు.
కర్ణుడి మరణం:
ఇక రథసారధి అయిన శల్యుడు కర్ణుడిని అడుగడుగునా చిత్రవధ చేస్తూ, సూటిపోటి మాటలతో ఆయన్ని కించపరుస్తూ యుద్దరంగలో కర్ణుడి ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు.
ఇక యుద్ధంలో మరణించే ముందు ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపాన్ని ధరించి, కర్ణుని వద్దకి వెళ్లి అతని సహజ కవచ కుండలాలని దానమడుగుతాడు. వెంటనే అర్జనుడు కర్ణుడి చాతీపై బాణం వేస్తాడు. బాధతో కర్ణుడు నేలకొరిగి మరణిస్తాడు.
ఇదీ కర్ణుడి జీవితం! కర్ణుడు తన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పుట్టినప్పటి నుంచీ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలని ఒకసారి తిరగేస్తే, ఎంతటి గొప్పవాడో మీకే అర్ధమవుతుంది.
కర్ణుడి గురించి ఆసక్తికరమైన విషయాలు:
- కర్ణుడికి తన అసలు వంశం గురించి తెలిసినప్పటికీ, తనను విడిచిపెట్టినందుకు కుంతిని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. దీనికి ప్రతిఫలంగా, అతను ఏ తల్లికి ఇవ్వలేనంత ప్రేమని, గౌరవాన్ని ఆమెకు ఇచ్చాడు.
- సూత వంశంలో పెరిగినందువల్ల తనని అందరూ సూత పుత్రుడని హేళన చేస్తూన్నా మౌనంగా భరిస్తూ వచ్చాడు.
- సూతపుత్రుడన్న కారణంగా గురు ద్రోణుడు ఇతనికి అస్త్రవిద్య నేర్పక పోయినా చింతించలేదు.
- అబద్దమాడి విద్య నేర్చుకొన్న పాపానికి పరశురాముడు శపించినా దానిని ఆశీర్వాదంగా స్వీకరించాడు.
- చిన్నారిని సంతోషపెట్టిన పాపానికి భూమాత ఆగ్రహానికి గురయినా బాధపడలేదు.
- దుర్యోధనుడి అధర్మ చర్యలు తనకి ఇష్టం లేకుండా మద్దతు ఇచ్చాడు. దుర్యోధనుడితో తనకున్న స్నేహం చివరికి వినాశనంతోనే ముగుస్తుందని తెలిసినా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే, అందరూ ఎగతాళి చేసినపుడు దుర్యోధనుడు ఒక్కడే తనని ఆదుకొన్నాడు కాబట్టి.
- తల్లికిచ్చిన మాట కోసం పాండవులని ఏమీ చేయలేదు. వారందరినీ కేవలం ఓడించటం మాత్రమే చేశాడు కానీ వారిని ఎన్నడూ చంపలేదు.
- తాను అర్జునుడికి సోదరుడని తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు, ఎందుకంటే, నిజం తెలిస్తే అర్జనుడు తనతో యుద్ధం చేయడు కాబట్టి.
- రణరంగంలో రథసారధి అయిన శల్యుడి మాటలు తూటాల్లా గుచ్చుకొంటున్నా వెనుదిరగలేదు.
- తన రథచక్రం భూమిలో కూరుకు పోయినప్పుడు యుద్ధ నియమాలకి వ్యతిరేకంగా అర్జనుడు నిస్సహాయ స్థితిలో ఉన్న తనపై బాణాలని సంధించినప్పుడు తనకిచ్చిన శాపాలు గుర్తొచ్చి మౌనంగా తల వంచాడు.
- ఇక చివరిగా అర్జునుడి తండ్రి ఇంద్రుడు తన కవచ కుండలాలని ఇవ్వమని మోసగిస్తున్నాడని కర్ణుడికి తెలుసు. వాటిని వదులుకుంటే తనకే ఓటమి తప్పదని ఆయనకు బాగా తెలుసు. అయినప్పటికీ, అతను ఇంద్రుడి దానాన్ని తిరస్కరించలేదు. ధర్మ మార్గంలో పయనించినప్పటికీ, కర్ణుడు అర్జునుడి చేతిలో మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది, అది కూడా అనైతిక మార్గంలో.
కర్ణుడి గొప్పతనం:
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అనేది ఓ సామెత. కుంతీకి ఇచ్చిన మాట, గురుదేవుని కోపం, రథసారథి మాటల పోరు, భూదేవి శాపం, ఇంద్రుడి వెన్నుపోటు.. ఇలా చాలానే కర్ణుడి చావుకి కారణాలు అయ్యాయి.