వాతావరణ మార్పుల వల్ల ఈమద్య కాలంలో అనేక వింతలు జరుగుతున్నాయి. అయితే, ఈ రకమైన వింతని మాత్రం బహుశా ఇప్పటివరకూ చూసి ఉండరేమో! ఊరు ఊరంతా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ భూమి లోపలి నుంచీ చొచ్చుకొని పైకి రావటం చూస్తే మీకెలా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఒళ్ళు ఝలదరిస్తుంది కదూ!
సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది అదికూడా మరెక్కడో కాదు, సాక్షాత్తూ ఆ తిరుమల వేంకటేశుడు కొలువై ఉన్న తిరుపతి పట్టణంలో. మొన్నీమధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయని మనం విన్నాం. అయితే, వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టటంతో ప్రజలంతా ఎవరిపనుల్లో వాళ్ళున్నారు.
తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్లో ఊహించనివిధంగా ఓ 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్ భూమి లోపలి నుంచి బయటకు వచ్చింది. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన చూసి జనాలు హడలిపోయారు. భయంతో పరుగులు పెట్టారు.
వివరాల్లోకి వెళితే, తిరుపతి పట్టణంలో గతంలో 18 సిమెంట్ రింగులతో భూమిలోపల ఒక వాటర్ ట్యాంక్ నిర్మించారు. తాజాగా ఒక మహిళ ఆ ట్యాంక్ని శుభ్రం చేస్తుండగా… ఒక్కసారిగా ట్యాంక్ పైకి లేచింది. అలా ట్యాంక్ పైకి లేస్తుండటంతో… అందులో ఉన్న ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురై… ట్యాంక్ నుంచి బయటకు రావాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.
భూమిలోపలి నుంచి అలా బయటకు వచ్చిన ఆ ట్యాంక్… ఇప్పటికీ నిటారుగా నిలిచే ఉంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. అయితే, గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల భూమి లోపలి పొరలు బాగా నానడం వల్ల… భూమి ఉబికి ఇలా వాటర్ ట్యాంక్ పైకి వచ్చి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.