ఇండియాలో పుట్టి… చైనీయుల ఇష్ట దైవంగా మారి… బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన బోధిధర్మ గురించి మీలో ఎంత మందికి తెలుసు? జెన్ మత స్థాపకుడిగా… షావోలిన్ వంటి మార్షల్ ఆర్ట్స్ మూల గురువుగా… ఎంతో ఖ్యాతి గడించినప్పటికీ, అతని జీవితం, మరియు మరణం గురించి పురాణాలు ఎందుకు నిగూడంగా ఉంచాయో ఇప్పటికీ అంతు చిక్కట్లేదు. బోదిధర్మ మన తెలుగువారే అయినప్పటికీ ఆయన మరణమే మిస్టరీగా మారింది. చైనాయే ఆయన్ని చంపేసిందా? లేదా ఆయన ఇండియాకి తిరిగి వచ్చేశారా? చివరి రోజుల్లో అసలేం జరిగింది? ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలను తెలుసుకోనేముందు సెమీ-లెజెండరీ బుద్దిస్ట్ మాంక్ అయిన బోధిధర్మ యొక్క లైఫ్ హిస్టరీ, అండ్ డెత్ మిస్టరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బోధిధర్మ ఎవరు?
సాంప్రదాయ కథనాల ప్రకారం, బోధిధర్మ 5, లేదా 6 శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడులోని కాంచీపురంలో జన్మించాడు. అప్పట్లో కాంచీపురాన్ని పాలిస్తున్న రాజు స్కందవర్మ యొక్క మూడో కుమారుడితను. అంటే… పల్లవ రాజవంశానికి చెందిన యువరాజు. బోదిధర్మ అసలు పేరు ధర్మ వర్మ. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత అతని గురువు బోదిధర్మగా పేరు మారుస్తాడు. బోదిధర్మ అంటే – సంస్కృతంలో “ధర్మాన్ని మేల్కొలుపు” అని అర్ధం.
బోదిధర్మ జీవితాన్ని మార్చేసిన లేఖ
బోదిధర్మ చూడటానికి ఎంతో అందంగా… గంభీరంగా… కనిపించేవారు. అలాగే మంచి బుద్ధిశాలి కూడా. అయితే, ఓ రోజు ప్రజ్ఞతార అనే బౌద్ధ సన్యాసి స్కందవర్మ ఆస్థానానికి వస్తాడు. అతను వెళుతూ… వెళుతూ… ధర్మ వర్మ కోసం ఓ లేఖను అక్కడే వదిలి వెళతారు. అందులో ‘‘జననానికి ముందు నీవెవ్వరు? జన్మించిన తర్వాత నీవెవ్వరు’’ అని రాసి ఉంటుంది. ఆ లేఖలో అలా ఎందుకు రాసి ఉందో ధర్మవర్మకు అర్థం కాలేదు. దాని సమాధానం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. చివరికి జవాబు తెలుసుకోడానికి ఏకంగా ప్రజ్ఞతార ఆశ్రమానికే వెళ్ళారు.
సన్యాసం స్వీకరించటం
సమాధానాన్ని వెతుక్కుంటూ ప్రజ్ఞతార ఆశ్రమానికి వచ్చి చేరతాడు ధర్మవర్మ. ఆయనను కలిసినప్పటికీ సరైన సమాధానం మాత్రం దొరకలేదు. పైగా నీకు నువ్వుగానే ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కో! అని చెప్తారు. బంధాలకు, సుఖాలకు, లోనై ఉన్నంత కాలం ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. అందుకే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకో! అని ప్రజ్ఞతార చెప్తారు.
దీంతో ధర్మవర్మ తన రాజ్యాన్ని వదిలి ఆశ్రమంలోనే ఉంటానికి నిశ్చయించుకుంటాడు. బౌద్ధ సన్యాసాన్ని స్వీకరించి ప్రజ్ఞతార వద్ద శిష్యరికానికి చేరాడు. ప్రజ్ఞతార ధర్మ వర్మ పేరును బోది ధర్మగా మారుస్తారు. అప్పటినుండీ బోది ధర్మ తన రాజ హోదాను త్యజించి సన్యాసి అయ్యాడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు.
యుద్ధ విద్యలు నేర్చుకోవటం
బోది ధర్మలో మానసిక స్థైర్యం ఎక్కవగా ఉన్నా… శారీరక శక్తి మాత్రం చాలా తక్కువగా ఉందని గురువు గమనించారు. ఈ సందర్భంగా కొన్నాళ్లు యుద్ధ విద్యలు నేర్చుకోవాలని ఆదేశిస్తారు. దీంతో బోదిధర్మ దేశం మొత్తం తిరిగి యోగాతోపాటు, మర్మవిద్యలన్నీ నేర్చుకున్నారు. నాలుగేళ్ల తర్వాత శారీరక, మానసిక దృఢత్వంతో తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు.
అప్పుడు గురువు బోదిధర్మకు తన పుట్టుకకు సంబందించిన అసలు రహశ్యం చెప్తారు. ‘‘నువ్వు సాధారణ సన్యాసివి కావు. నీ పుట్టకకు ఓ కారణం ఉంది. నువ్వు మరో బుద్ధుడిగా మారి బౌద్ధమతాన్ని, దాని యొక్క ఉద్దేశాలను విశ్వవ్యాప్తం చేయాలి’’ అని ఆయన చెప్పారు.
చైనాకు ప్రయాణం
చైనాలో 1వ శతాబ్దం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే, అక్కడి ప్రజలు మాత్రం బౌద్ధ ధర్మాలను విస్మరించి పూర్తిగా బుద్ధి హీనులుగా మారడం ప్రజ్ఞతారను కలిచివేసింది. అందుకే చైనాలో బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు నువ్వు రెండో బుద్ధుడిగా మారి అక్కడికి వెళ్లాలని బోదిధర్మను ఆదేశించారు. అంతకంటే ముందు బౌద్ధ గ్రంథాలు, చైనా భాష, మరియు సాంప్రదాయాల మీద అవగాహన తెచ్చుకోవాలని కూడా పేర్కొన్నారు. గురువు ఆదేశాల మేరకు బోదిధర్మ చైనా వెళ్ళాలని నిర్ణయించుకొంటాడు. అందుకోసం 40 ఏళ్ల పాటు కఠోరంగా శ్రమించి బౌద్ధ గ్రంథాలన్నిటిపై పట్టు సాధిస్తారు. చివరికి 67 ఏళ్ల వయస్సులో చైనాకు బయల్దేరారు.
ఇది కూడా చదవండి: Mahavatar Babaji’s Life and Teachings
చక్రవర్తి ‘వు’ తో ఘర్షణ
బౌద్ధ దేవాలయాలను నిర్మించడంలో మరియు బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన లియాంగ్ రాజవంశానికి చెందిన చక్రవర్తి ‘వు’ బోధిధర్మను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. బోదిధర్మ చైనాలో అడుగు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసుకుని రాజు కొన్ని వ్యక్తిగత సందేహాలను అతని ద్వారా తీర్చుకోవాలని భావించాడు. తాను ఎన్నో దానధర్మాలు చేశానని, అలానే బౌద్ధ సన్యాసులను కూడా పోషిస్తున్నానని తెలుపుతాడు. ఇన్ని పుణ్యాలు చేస్తున్నందుకు తాను స్వర్గానికి వెళ్తానా? లేదా నరకానికి వెళ్తానా? అని అడిగాడు.
అందుకు సమాధానంగా ‘నువ్వు తప్పకుండా నరకానికే వెళ్తావు. ఎందుకంటే, నీవు ధనంతో పుణ్యాన్ని కొంటున్నావు. అంతేకానీ, మంచి మనసుతో దానం చేయడం లేదు. స్వర్గానికి వెళ్లాలనే స్వార్థంతో పుణ్యాత్ముడిలా నటిస్తున్నావు. ఇలాంటివారు తప్పకుండా నరకానికే పోతారు’’ అని బోదిధర్మ తెలిపారు. అంతే, రాజుకు కోపం తన్నుకు వచ్చింది. వెంటనే అతన్ని కోట వదిలి వెళ్లాలని ఆదేశిస్తాడు. దీంతో బోది ధర్మ అక్కడి నుంచి ఉత్తర చైనావైపు తన ప్రయాణం కొనసాగిస్తారు.
షావోలిన్ ఆలయానికి రాక
అనంతరం బోధిధర్మ హెనాన్ ప్రావిన్స్లోని షావోలిన్ ఆలయం సమీపానికి చేరుకొంటారు. అక్కడే ఓ గుహలో ధ్యానం చేయడం మొదలు పెట్టారు. అలా తొమ్మిదేళ్లపాటు బోధిధర్మ ఎవరితో మాట్లాడకుండా పూర్తిగా మౌనం వహిస్తూ ద్యానంలోనే ఉన్నారు. పురాణాల ప్రకారం, అతను తొమ్మిదేళ్లపాటు ఆ గుహలోనే ఉంటూ… గోడకు ఎదురుగా కూర్చొని ధ్యానం చేశారని చెప్తారు.
బోదిధర్మ మహిమలు
బోదిధర్మ గొప్పతనం గురించి తెలిసి ‘దాజూ ల్యూక్ అనే సన్యాసి బోదిధర్మ శిష్యుడిగా చేరాలని ఆయన దగ్గరికి వస్తాడు. కానీ, కఠోర ధ్యానంలో ఉన్న బోది ధర్మ ల్యూక్ విన్నపాన్ని పట్టించుకోరు. దీంతో ల్యూక్ అక్కడి వాతావరణం మైనస్ డిగ్రీలకు పడిపోయినా సరే… బోది ధర్మ వద్దే కుర్చొని… ఆయన కోసం ఎదురుచూసేవాడు.
ఎంతకీ కళ్ళు తెరచి చూడకపోయేసరికి ఓర్పు నశించి చివరికి ఓ రోజు ల్యూక్ కత్తితో తన చేతిని నరికేసుకుంటాడు. ఆ రక్తం బోదిధర్మపై పడుతుంది. దీంతో బోదిధర్మ కళ్లు తెరిచి చూస్తారు. అతని పట్టుదలకి మెచ్చి… తన తపోశక్తితో అతనికి తిరిగి చేతిని ప్రసాదిస్తాడు. అనంతరం ల్యూక్ను తన శిష్యుడిగా చేర్చుకుంటారు. అప్పటినుంచీ ల్యూక్ పేరును బోదిధర్మ ‘షెన్ గ్యాంగ్’ గా మారుస్తాడు.
అది మొదలు ఆయనకు అన్ని దేశాల నుంచి శిష్యులు వచ్చి చేరారు. వారందరికీ ఆయన తన బోధనలను వినిపించేవాడు. ఇంకా వీరందికీ బోధి ధర్మ తాను భారత దేశంలో నేర్చుకున్న యోగా, మరియు షావోలిన్ వంటి మార్షల్ ఆర్ట్స్ ని కూడా నేర్పించేవారు. అంతేగాక మర్మ కళల్లో ఒకటైన బోదిధర్మ ఆయుర్వేద వైద్యం ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడింది.
బుద్దుడిగా గుర్తింపు
తొమ్మిదేళ్లు ధ్యానంలోనే ఉన్న బోదిధర్మను ప్రజలు బుద్ధుడి యొక్క రెండో అవతారంగా భావిస్తారు. ఈ విషయం చైనా మొత్తం పాకింది. అక్కడి నుంచి జపాన్, కోరియా వంటి ఇతర దేశాలకు కూడా ఆయన బోధనలు విస్తరించాయి.
జెన్ మత స్థాపన
బోదిధర్మ చైనాలో బౌద్ధ ధర్మ బోధనలు చేస్తూ అక్కడి ప్రజలకి ఇష్ట దైవంగా మారారు. 28వ బౌద్ధ ఆచార్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా భారత దేశంలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మాలతో మేళవించి ‘జెన్ బుద్ధిజం’ను సృష్టించారు. బోదిధర్మను చైనాలో ‘దాము’ అని, జపానులో ‘ధర్మ’ అని పిలిచేవారు.
ఇది కూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology
షావోలిన్ పుట్టుక
చైనా ప్రజలకు షావోలిన్ అనే మర్మ విద్యను నేర్పించాడు బోదిధర్మ. పూర్వం మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన కుంగ్ఫూ చైనీయుల యుద్ధ కళగా పేరుపొందింది. ఇది కుంగ్ఫూ కంటే కూడా ప్రమాదకరమైనది, కష్టమైనది కూడా. భారతీయు యుద్ధ కళలను మేళవించి ఈ షావోలిన్ ను రూపొందించారు. ఈ విద్య చైనా ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. ఆత్మరక్షణకు ఎంతగానో పనికొచ్చింది.
ఈ షావోలిన్ నుంచీ పుట్టుకొచ్చినవే ఇప్పుడు మనం చూస్తున్న కలరీ, కుంగ్ఫూ, కరాటే, తైక్వాండో, బాక్సింగ్ మొదలైనవి. అటువంటి ప్రాచీన యుద్ధ కళను ప్రపంచానికి పరిచయం చేసి మార్షల్ ఆర్ట్స్ పితామహుడుగా మారాడు. అందుకే నేటికీ మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ పితామహుడు అంటే బోధిధర్మకి గౌరవ సూచకంగా తమ కుడి చేతిని ఉపయోగించి ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నట్లు చూపుతారు.
కనురెప్పలను కత్తిరించుకోవడం
ఒక రోజు ధ్యానం చేస్తున్న సమయంలో తన శిష్యులలో ఒకరు నిద్రలోకి జారుకుంటారు. అది చూసిన బోదిధర్మ అతనిని తీవ్రంగా మందలిస్తాడు. ధ్యానం చేసేవారికి నిద్ర పెద్ద శత్రువు. కానీ, ధ్యానం చేసేవారికి కావాల్సింది ఏకాగ్రత. అలాంటి ఏకాగ్రతకి భంగం కలిగించే శత్రువుని తరిమికొట్టాలన్నదే అతని ముఖ్య ఉద్దేశ్యం.
కానీ, మరోసారి బోదిధర్మకూడా ధ్యానం చేస్తూ నిద్రపోతాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు మళ్లీ నిద్రపోకుండా ఉండేందుకు తన కనురెప్పలు కత్తిరించుకున్నాడు. అతని కనురెప్పలు నేలపై పడి మొట్టమొదటి తేయాకు మొక్క పుట్టిందని చెబుతారు. అప్పటి నుంచి బౌద్ధులు నిద్రలోకి జారుకోకుండా ఆ మొక్క ఆకులతో టీ తయారు చేసుకొనేవారని చెప్తారు.
బోధిధర్మ మరణం
గురువుకు ఇచ్చిన మాట ప్రకారం.. బోదిధర్మ చైనాలో బౌద్ధ ధర్మాన్ని తిరిగి స్థాపించాడు. ఇక ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన శిష్యులకు తెలిపి.. షేన్ గ్యాంగ్ను ఇకపై గురువుగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. అయితే, బోదిధర్మ తమని విడిచి వెళ్లటం ఇష్టం లేని ఓ శిష్యుడు అతనికి ఆహారంలో విషం కలిపి పెడతాడు. ఆ విషాహారం తిన్న బోదిధర్మ చనిపోయాడని, అతని బౌతిక కాయాన్ని ఓ పర్వతం ప్రాంతంలో సమాధి చేశారని చెబుతారు. అయితే, అది అసత్యమని బోదిధర్మ 170 ఏళ్ల వయస్సులో అంటే 536లో చనిపోయారనే మరో వాదన కూడా ఉంది.
బోదిధర్మ ఇప్పటికీ బతికే ఉన్నారా?
చైనా ప్రజలు బోదిధర్మ చనిపోయారంటే నమ్మరు. ఇందుకు మరో కథ ప్రచారంలో ఉంది. బోదిధర్మ చనిపోయాడని భావిస్తున్న రోజుల్లో హిమాలయాల్లో నడుచుకొంటూ వెళ్తున్న బోదిధర్మని చూస్తాడు ఓ సైనికుడు. విచిత్రం ఏంటంటే… అతను ఒక కాలికి మాత్రమే షూ వేసుకొని వెళ్తున్నాడు. ఆ దృశ్యం చూసి షాకైన ఆ సైనికుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారని అతడిని ప్రశ్నిస్తాడు. వెంటనే బోదిధర్మ నా స్వదేశానికి తిరిగి వెళ్తున్నానని చెబుతారు.
అంతేకాదు, తాను బతికి ఉన్నట్లు చెబితే కష్టాల్లో పడతావని ఆ సైనికుడ్ని హెచ్చరిస్తాడు. అలాగే మీ రాజు త్వరలోనే చనిపోబోతున్నాడు అని కూడా చెప్పి అక్కడికి నుంచి వెళ్లిపోతారు. కానీ, ఆ సైనికుడు ఈ విషయాన్ని వెంటనే రాజుతో చెప్తాడు. బోది ధర్మ ఇప్పటికీ బతికే ఉన్నారని, తాను చూశానని ఆ రాజుకు చెబుతాడు. కానీ, ఆ సైనికుడు తనతో అసత్యం చెప్పాడని భావించి రాజు అతన్ని జైల్లో బంధిస్తాడు.
ఇది కూడా చదవండి:
సమాధి తవ్వటం
ఒకరోజు అనుమానంతో రాజు బోది ధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ ఆయన మృతదేహం ఉండదు, కేవలం ఒక షూ మాత్రమే కనిపిస్తుంది. దీంతో రాజు బోది ధర్మ బతికే ఉన్నట్లు నమ్ముతాడు. కొద్ది రోజలు తర్వాత ఆ రాజు చనిపోతాడు. అప్పటి నుంచి చైనా ప్రజలు తాము దైవంగా పూజించే బోదిధర్మకు మరణం లేదని, ఆయన ఇప్పటికీ బతికే ఉండి ఉంటారని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో బోదిధర్మ నిజంగా బతికే ఉన్నారా? లేదా చనిపోయారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
చివరిమాట
ఏది ఏమైనా జెన్ మత మూలపురుషుడిగా, మార్షల్ ఆర్ట్స్ సృష్టికర్తగా బోదిధర్మ వారసత్వం ఎంతో ముఖ్యమైనది. అతని బోధనలు మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ప్రేరేపించబడింది. ఇదంతా ఒక ఎత్తైతే మన దేశానికి చెందిన వ్యక్తికి పరాయి దేశంలో అంత గొప్ప ఖ్యాతి లభించడం రియల్లీ గ్రేట్ కదూ! ఇది మనదేశ ఔన్నత్యానికి మరో నిదర్శనం.