రాయబారాలు, రాజకీయ ఎత్తుగడలు, వెన్నుపోట్లు మహాభారతంలో కొత్తేమీ కాదు. అలాంటి మహాభారతంలో కొంతమంది కోవర్టులు కూడా ఉన్నారు. దానికి ఉదాహరణగా మనం శల్యుడి గురించి చెప్పుకోవచ్చు. నిజానికి శల్యుడు పాండవుల పక్షపాతే అయినా… కౌరవుల పక్షపాతిగా ఉంటూ వారి పతనానికి కారణమవుతాడు. అందుకే నమ్మి దొంగదెబ్బ తీసినవాడిని ‘శల్య సారధ్యం’ అంటుంటాం. ఇంతకీ అసలు ఈ శల్యుడు ఎవరు? పాండవులకి ఏమవుతాడు? వారి పక్షాన ఉంటూనే కౌరవుల్ని ఎందుకు దెబ్బ తీయాలని అనుకొంటాడు? కర్ణుడి మరణానికి శల్యుడు కారణం ఎలా అయ్యాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఇప్పుడీ ఆర్టికల్ లో డీటైల్డ్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా అసలు ఈ శల్యుడు ఎవరో తెలుసుకుందాము.
శల్యుడు ఎవరు?
మనకు తెలుసు కదా పాండవులకు తల్లి అయిన కుంతీదేవికి పాండురాజు భర్త. ఇతనికి కుంతీదేవి కాకుండా ఇంకొక భార్య కూడా ఉంది. ఆమె పేరు మాద్రి. ఈమె పాండవులలో చివరి వారయిన నకుల సహదేవులకు తల్లి. ఈ మాద్రి సోదరుడే శల్యుడు. ఇతను మద్ర రాజ్యానికి అధిపతి.
శల్యుడికి కురు వంశానికి మద్య సంబంధం ఏంటి?
ఒకసారి పాండురాజు హస్తినాపురానికి వెళుతుండగా దారిలో శల్యుడి సైన్యానికి ఎదురుపడతారు. అప్పుడు శల్యుడు, అతని సేనాధిపతి ఇద్దరూ పాండురాజుని కలుస్తారు. వారు చేసిన మర్యాదలకు ముగ్ధుడయిన పాండురాజు శల్యుడికి మంచి స్నేహితుడు కూడా అవుతాడు. పాండురాజు ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు వెంటనే శల్యుడి గురించి వేగుల ద్వారా పూర్తి వివరాలు తెప్పించుకుంటాడు.
అందులో భాగంగానే మద్ర రాజ్యానికి అధిపతి అయిన శల్యుడికి మాద్రి అనే ఒక అందమయిన సోదరి కూడా ఉన్నదని తెలుసుకుంటాడు. ఆమెతో పాండురాజుకి రెండవ వివాహం చెయ్యాలని తలచి శల్యుడికి కబురు పంపుతాడు. ముందు సందేహించినా చివరికి స్నేహితుడితో వియ్యం అందుకోవటం మంచిదే అని గ్రహించి మాద్రిని పాండురాజుకి ఇచ్చి వివాహం చెయ్యటానికి అంగీకరిస్తాడు.
ఈ సందర్భంలో శల్యుడు భీష్ముడితో తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం గురించి వివరిస్తాడు. తమ ఆచారం ప్రకారం, వరుడి వైపు నుండి వధువు రక్తసంబంధీకులకు కట్నం ఇవ్వాలని, ఇది మంచి అయినా చెడు అయినా తాను ఈ పూర్వీకుల నుండీ వచ్చిన ఈ ఆచారాన్ని అతిక్రమించలేనని భీష్ముడికి చెప్తాడు. అయితే భీష్ముడు దీనికి అంగీకరిస్తాడు. వివాహం జరిగే సమయంలో భీష్ముడు కురు వంశం తరఫున శల్యుడికి ఎన్నో ఆభరణాలను, ఇంకా చాలా బంగారాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ విధంగా మద్ర రాజ్యానికి కురు వంశంతో వియ్యం ఏర్పడుతుంది.
శల్యుని వారసులు ఎవరు?
ఒకసారి, పాండురాజు వేటకు వెళ్ళినప్పుడు జింకల రూపంలో ఉన్న కిదమ ఋషిని, అతని భార్యను తెలియక బాణం వేసి చంపుతాడు. చనిపోయే ముందు ఆ ఋషి పాండురాజుని ఎప్పుడయితే అతను భార్యల దగ్గరకు కోరికతో వెళతాడో అప్పుడు చనిపోతాడని శపిస్తాడు. ఆ శాప భయంతో, పాండురాజు రాజ్యాన్ని తన సోదరుడయిన ధృతరాష్ట్రుడికి ఇచ్చి తన భార్యలయిన కుంతి, మాద్రితో వనవాసానికి వెళ్ళిపోతాడు.
అక్కడ దుర్వాసముని కుంతీదేవికి ఒక గొప్ప వరం ఇస్తాడు. అది ఏంటంటే, కుంతీదేవి ఎవరయినా దేవుడిని స్మరిస్తే, వెంటనే ఆ దేవుడు ఒక బిడ్డను ఇస్తాడని వరం. ఆ వరం వలన కుంతీదేవికి యమధర్మరాజు వలన ధర్మరాజు, వాయుదేవుడి వలన భీముడు, ఇంద్రుడి వలన అర్జునుడు కలుగుతారు. ఇది చూసిన మాద్రి తనకు పిల్లలు లేరని బాధపడుతుంది. అప్పుడు, కుంతీదేవి తనకు తెలిసిన ఆ వరాన్ని మాద్రికి కూడా చెప్తుంది. అప్పుడు, మాద్రి అశ్విని దేవతలను స్మరించి ఇద్దరు కుమారులను పొందుతుంది. వారే నకులుడు, సహదేవుడు. అశ్విని దేవతలలో నాసత్యుడు వలన నకులుడు, ఇంకా దనుడు వలన సహదేవుడు పుట్టారు.
ఇలా కొంత కాలం గడిచిన తరువాత, ఒక రోజు కోరికతో మాద్రి దగ్గరకు వచ్చిన పాండురాజు ముని శాపం వలన మరణిస్తాడు. తను ఆపలేకపోవటం వల్లనే ఈ ఘోరం జరిగిందని భావించిన మాద్రి తన పిల్లలను కూడా కుంతీదేవికి అప్పగించి తన భర్త శవంతో పాటుగా ఆత్మాహుతి చేసుకుంటుంది.
శల్యుడికి కూడా ముగ్గురు సంతానం కలుగుతారు. వారి పేర్లు రుక్మాంగద, రుక్మరథ మరియు మద్రాంజయ. తన సోదరిని కోల్పోయిన కొన్ని సంవత్సరాలకు శల్యుడు నకులుడిని సహదేవుడిని తన మద్ర రాజ్యానికి ఆహ్వానిస్తాడు.
నకులుడిని సహదేవుడిని తన దగ్గరే ఉంచుకొని వారిని తన వారసులుగా చేయాలని అనుకుంటాడు. వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన సందర్భంగా తన మనసులోని కోరికను నకుల సహదేవులతో చెప్తాడు. హస్తినాపురంలో ఉండి ధర్మరాజు చక్రవర్తి అవుతాడని, మీరు ఇద్దరూ పాండవులలో నాలుగవ, అయిదవ స్థానాలలో ఉండిపోతారని, అలా కాకుండా ఇక్కడే ఉంటే మద్ర రాజ్యానికి అధిపతులుగా ఉండవచ్చని చెప్తాడు.
శల్యుడు ప్రతిపాదించిన ఈ ఆలోచనను నకులుడు మొదట సందేహిస్తాడు. తన సంతానాన్ని వదులుకొని చెల్లెలి కుమారులకు రాజ్యం ఇవ్వాలని అనుకోవటంలో ఏదో దురాలోచన ఉన్నదని, తాము దేవతల వలన పుట్టిన సంతానం అవ్వటం వల్లనే శల్యుడు ఈ ఆలోచన చేశాడని భావిస్తాడు. వెంటనే శల్యుడి ఆలోచనను నకుల సహదేవులు తిరస్కరిస్తారు.
పాండవులతో ఉండటం వలన తమకు రాజ్యాధికారం రాదని తెలుసునని, అయినా కూడా తమ సోదరులు ఇంకా కుంతీదేవి తమను ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూస్తున్నారని, అవకాశం కోసం పావులుగా తమను వాడుకోరని, తమను సేవకులుగా ఎప్పటికీ చూడరని శల్యుడికి వివరించి చెప్తాడు. ఇలా కొంతసేపు శల్యుడితో మాట్లాడిన తరువాత శల్యుడి మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేదని నకుల సహదేవులు గ్రహిస్తారు. చివరికి, అతని మంచి ఉద్దేశ్యం గ్రహించి తమను ఎప్పటికీ మిగతా సోదరుల నుండి వేరు చేయకుండా ఎప్పుడూ వాళ్ళతోనే ఉండనిస్తే శల్యుడి సింహాసనానికి వారసులుగా ఉండటానికి తమకు సమ్మతమే అని చెప్తారు.
ఇది కూడా చదవండి: What Are the Timeless Lessons from Vidura’s Teachings?
శల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు ఎందుకు వెళ్ళాడు?
పాండవులకు కౌరవులకు సంధి కుదరక ఇక కురుక్షేత్ర యుద్ధం అనివార్యం అని తెలిసిన శల్యుడు తన రాజ్య సైన్యాన్ని మొత్తం తీసుకొని పాండవులతో కలిసి యుద్ధం చెయ్యటానికి బయలుదేరతాడు.