ఈరోజు అంటే… 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం పంజాబ్ ఎలక్షన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ ఎలక్షన్స్ లో సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే! మాళవిక సూద్ పంజాబ్ లోని మోగా నియోజక వర్గం నుండీ పోటీ చేస్తున్నారు.
అయితే, పంజాబ్లో ఉన్న మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరింగింది. ఈ క్రమంలో అధికారం చేజిక్కించుకోవటం కోసం పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. ఓటర్లని ఆకర్షించేందుకు వారిపై వరాల జల్లు కురిపించాయి.
అందులో భాగంగానే, నటుడు సోనూ సూద్ కూడా ఓటర్లని ఆకర్షించేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారనీ, మోగాలోని ఇతర పార్టీ అభ్యర్థుల ఓట్లని కొనే ప్రయత్నం చేస్తున్నారని శిరోమణి అకాళీ దళ్ నేతలు ఆరోపిస్తున్నారు.
పోలింగ్ సరళిని పరిశీలించేందుకు సోనూ సూద్ మోగాలోని పోలింగ్ కేంద్రాలకి వెళ్లారు. అప్పుడు ఓటర్లని ప్రభావితం చేస్తున్నారని ఎలక్షన్ కమీషన్ కి కంప్లైంట్ చేశారు. దీంతో, ఎన్నికల సంఘం సోనూ సూద్ కదలికలపై నిఘా పెట్టింది. అనంతరం ఆయన కారుని సీజ్ చేసింది.
ఈ విషయమై సోనూ సూద్ స్పందిస్తూ… ఓటు ఎవరికి వేయాలి అనే విషయమై… తాను ఓటర్లని ఏమీ కోరలేదని, పోలింగ్ కేంద్రాల బయట ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరాలను మాత్రమే తాను సందర్శిస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ఈసీ పట్టించుకోలేదు.